Team New Zealand: రెండో టెస్టులో వారిద్ద‌రిలో ఒక‌రిని త‌ప్పించాలి: జహీర్‌ఖాన్

  • రెండో టెస్టులో ఆడ‌నున్న కోహ్లీ
  • దీంతో జ‌ట్టులో  ఒక‌రిని త‌ప్పించే అంశంపై జ‌హీర్ స్పంద‌న‌
  • రహానె, పుజారాలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంద‌న్న జ‌హీర్
zaheer khan on team india squad

భార‌త్-న్యూజిలాండ్ మ‌ధ్య రెండో టెస్టులో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఆడ‌నున్నాడు. దీంతో ఆయ‌న కోసం జ‌ట్టులోని ఒక‌రిని ప‌క్క‌న‌బెట్ట‌నున్నారు. ఎవ‌రిని జ‌ట్టునుంచి ప‌క్క‌కు పెట్టాల‌న్న‌ విష‌యంపై టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్ స్పందిస్తూ...  తొలి టెస్టులో శ్రేయస్ బాగా ఆడ‌డం వ‌ల్లే  రెండో టెస్టుకు మిడిల్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తిందని ఆయ‌న చెప్పాడు. శ్రేయ‌స్‌కు వ‌చ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడని జ‌హీర్ తెలిపాడు.

ఇప్పుడు రెండో టెస్టుకు కోహ్లీ ఆడ‌నుండ‌డంతో మిడిల్‌ ఆర్డర్‌లో కచ్చితంగా స్థానం కల్పించాలని ఆయ‌న చెప్పాడు.  ప్ర‌స్తుతం పుజారాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. జ‌ట్టులో ఎవరినైనా ప‌క్క‌కుపెట్టాలంటే ఓపెనర్లలో ఒకరిని తప్పించడం వంటివి మనం చాలాసార్లు చూశామ‌ని అన్నాడు.

దీంతో జట్టు యాజమాన్యం కూడా  పుజారాను ఓపెనింగ్ చేయాల‌ని అడిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పాడు. అలా జ‌రిగితే  జట్టు కూర్పులో మార్పులు జరగవని అన్నాడు. తొలి టెస్టులో రాణించిన శ్రేయస్‌ రెండో టెస్టులోనూ ఆడ‌తాడ‌ని చెప్పాడు. దీంతో ఒక ఓపెనర్‌నైనా పక్కనపెట్టాలని తెలిపాడు. లేక‌పోతే రహానె, పుజారాలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంద‌ని చెప్పాడు.

More Telugu News