ఫ్రెషర్స్ పార్టీ కలకలం.. 182 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా

182 medical students affected with Corona in Karnataka
  • ధార్వాడ్ లోని మెడికల్ కాలేజీలో కలకలం
  • కరోనా బారిన పడిన వారిలో అత్యధికులు రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నవారే
  • కొత్త వేరియంటా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్న వైద్య అధికారులు
సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న వైద్య విద్యార్థులకు కరోనా మహమ్మారి షాకిచ్చిన ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ లో జరిగింది. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఇటీవల ఫ్రెషర్స్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా నిబంధనలన్నీ గాలికొదిలేసి పార్టీని ఎంజాయ్ చేశారు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. పార్టీలో పాల్గొన్న విద్యార్థుల్లో ఏకంగా 182 మంది కరోనా బారిన పడ్డారు. ఈ బాధితుల్లో ఎక్కువ మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉండటం గమనార్హం. ఈ విషయం ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా ప్రయోజనం ఏమిటనే సందేహం జనాలను భయపెడుతోంది.

ధార్వాడ్ లోని ఎస్డీఎం మెడికల్ కాలేజీలో తొలుత 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో 66 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా మరి కొందరి రిపోర్టులు కూడా వచ్చాయి. మరో 116 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థుల సంఖ్య 182కి చేరింది. వీరంతా కూడా ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న వారే కావడం గమనార్హం. దీంతో, కాలేజీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీ కొవిడ్ క్లస్టర్ గా మారిపోయింది.

కాలేజీలో కరోనా కేసులపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడటంతో... ఇదేమైనా కొత్త వేరియంటా? అనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థులకు జన్యు పరీక్షలు చేయిస్తామని చెప్పారు. కాలేజీలో ఉన్న దాదాపు 3 వేల మంది విద్యార్థులకు, మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించారు. వీరిలో మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు కరోనా బారిన పడినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Go Back to Shorts
Karnataka
Medical College
Corona Virus

More Telugu News