Sandhya Convention: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసుల ముమ్మర గాలింపు

  • బిల్డర్లను మోసం చేసిన కేసులో అరెస్ట్
  • బెయిలుపై బయటకు వచ్చాక కనిపించకుండా పోయిన వైనం
  • శ్రీధర్‌రావుపై అసహజ లైంగిక దాడి కేసు కూడా
Sandhya Convention MD Sridhar Rao escapped

బిల్డర్లను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి బెయిలుపై బయటకు వచ్చిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు కనిపించకుండా పోయారు.  నార్సింగి, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా, గత నాలుగు రోజులుగా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్‌రావును ఈ నెల 18న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్‌రావును చర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా, బెయిలుపై బయటకు వచ్చిన ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, తన నుంచి రూ. 11 కోట్లు తీసుకుని ప్లాట్ అప్పగించకపోవడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగుతున్నాడంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్, ముంబైకి చెందిన పలువురు బిల్డర్లను శ్రీధర్‌రావు మోసం చేసినట్టు కూడా తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ శారీసెంటర్ యజమానురాలిని కూడా మోసం చేసినట్టు గుర్తించారు. అలాగే, సనత్‌నగర్‌లో శ్రీధర్‌రావుపై అసహజ లైంగిక దాడి కేసు కూడా నమోదైంది.  

 

More Telugu News