Peddapalli District: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ప్రయాణికులు చూస్తుండగానే రైలుకు ఎదురుగా నిల్చుని వ్యక్తి ఆత్మహత్య

  • హైదరాబాద్‌లోని ఓ హార్ట్‌వేర్ షాపులో పనిచేస్తున్న సంజయ్
  • మూడేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న వైనం
  • ప్రయాణికులు వారిస్తున్నా పక్కకు జరగని వైనం
  • అక్కడికక్కడే మృతి
Odisha man suicide in Ramagundam Railway station

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. స్టేషన్‌లోని ప్రయాణికులు చూస్తుండగానే ఓ వ్యక్తి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రయాణికులు వారిస్తున్నా అతడు పక్కకు జరగకపోవడంతో అప్పటికే దూసుకొచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని కైరాకు చెందిన సంజయ్ కుమార్ (27) తాతతో కలిసి హైదరాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేస్తున్నాడు.

మూడేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న సంజయ్‌కు కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినప్పటికీ అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సంజయ్ న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ ఫాస్ట్‌ రైలుకు ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు వస్తోందని, పక్కకు తప్పుకోవాలని కోరినప్పటికీ అతడు పట్టించుకోలేదు. ఈలోపు వేగంగా దూసుకొచ్చిన రైలు అతడిని ఢీకొనడంతో సంజయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News