Cricket: రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ కు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టే చాన్స్

  • అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ
  • 95 టీ20ల్లో 3,227 పరుగులు
  • మరో 12 పరుగుల దూరంలో గప్టిల్
  • రోహిత్ కు ఇంకో 141 పరుగులు అవసరం
Opportunity For Rohit and Guptil To Go Past Kohli

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేందుకు మార్టిన్ గప్టిల్, రోహిత్ శర్మ అతి చేరువయ్యారు. ఇప్పటిదాకా టీ20 మ్యాచ్ లలో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 95 మ్యాచ్ లలో 3,227 పరుగులను చేశాడు. ఇప్పుడు అతడిని దాటేందుకు గప్టిల్, రోహిత్ లకు అవకాశం వచ్చింది. రోహిత్ కొంత దూరంలోనే ఉన్నా.. గప్టిల్ మాత్రం అతి దగ్గరకు వచ్చేశాడు.


మరో 12 పరుగులు చేస్తే గప్టిల్.. కోహ్లీని దాటేస్తాడు. 110 మ్యాచ్ లలో 3,217 పరుగులు చేసిన గప్టిల్.. ఇవాళ్టి మ్యాచ్ లలో ఆ మార్కును అధిగమించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే కోహ్లీ, గప్టిల్ తర్వాత 3 వేల పరుగులు చేసిన జాబితాలో ఇటీవలి వరల్డ్ కప్ లో రోహిత్ జాయినయ్యాడు. అయితే, కోహ్లీని అధిగమించేందుకు రోహిత్ కు మరో 141 పరుగులు అవసరం. ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లలో రెచ్చిపోతేనే కోహ్లీ రికార్డును రోహిత్ అందుకునే అవకాశం ఉంటుంది.

అయితే, టీ20 కెప్టెన్ గా రోహిత్ కు అమోఘమైన రికార్డుంది. కెప్టెన్ గా అతడు 760 పరుగులు చేయడంతో పాటు రెండు శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఐదు అర్ధశతకాలూ ఉన్నాయి. అంతేకాదు.. టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ (29), రోహిత్ (27)లు ఉండడం మరో విశేషం. ఈ రెండు మ్యాచ్ లలో రోహిత్ ఫిఫ్టీలు చేస్తే.. కోహ్లీ రికార్డును రోహిత్ సమం చేస్తాడు.

More Telugu News