Thief: డైటింగ్ చేసి మరీ ఈ దొంగ బరువు తగ్గాడు... ఎందుకో తెలుసా...?

  • అహ్మదాబాద్ లో చోరీ
  • మాజీ పనిమనిషే దొంగ అని గుర్తించిన పోలీసులు
  • ఓ కిటికీలోంచి దూరి దొంగతనం చేసిన వైనం
  • ఆ కిటికీలో పట్టేందుకు 5 కేజీల బరువు తగ్గిన దొంగ
  • 3 నెలల పాటు ఒక్కపూటే భోజనం
Thief got weight lose to steal in a house

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అహ్మదాబాద్ లో నివసించే మోహిత్ మరాడియా తన ఇంట్లో మోతీ సింగ్ చౌహాన్ అనే వ్యక్తిని పనివాడిగా పెట్టుకున్నాడు. మోతీ సింగ్ స్వస్థలం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్. మోతీ సింగ్ మూడేళ్ల కిందట... మోహిత్ మరాడియా వద్ద పనిలో నుంచి వైదొలిగాడు.

అయితే, మరాడియా ఇంట్లో బాగా డబ్బు, బంగారం ఉండడంతో వాటిని కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయో బాగా తెలిసిన మోతీ సింగ్... ఓ చిన్న కిటీకీని తనకు అనువైన మార్గంగా ఎంచుకున్నాడు. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఆ కిటికీయేమో బాగా చిన్నది... మోతీ సింగ్ కాస్త లావు మనిషి. ఆ కిటీకీలోంచి దూరాలంటే తాను సన్నబడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కఠోర ఆహార నియమాలు పాటించాడు.

ఏకంగా 3 నెలల పాటు రోజుకు ఒక్కపూటే తినేవాడు. ఎలాగైతేనేం 5 కేజీల బరువు తగ్గి ఈ సన్నని కిటికీలోంచి దూరి రూ.13 లక్షల విలువైన సొత్తు కాజేశాడు. అయితే, ఆ కిటికీకి ఉన్న గ్లాస్ ను పగులగొట్టేందుకు ఉపయోగించిన పరికరం మోతీ సింగ్ ను పోలీసులకు పట్టించింది. దాన్ని అక్కడే వదిలేసి వెళ్లడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ పరికరం కొన్న షాపు సిబ్బందిని విచారిస్తే మోతీ సింగ్ వివరాలు తెలిశాయి. దాంతో అతడిని అరెస్ట్ చేశారు.

సాధారణంగా ఎవరైనా ఆరోగ్యంగా ఉండేందుకు, నాజూకుదనం కోసం బరువు తగ్గుతారు. కానీ ఇలా దొంగతనం కోసం బరువు తగ్గడం తమను విస్మయానికి గురిచేసిందని పోలీసులు తెలిపారు.

More Telugu News