MLA Roja: మూటాముల్లె సర్దుకుని చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ వెళ్లే పరిస్థితి వచ్చింది: రోజా

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన రోజా
  • మహిళా సాధికారత అంశంపై స్పీచ్
  • చంద్రబాబు మహిళా ద్రోహి అంటూ వ్యాఖ్యలు
  • కుప్పంలో కూడా ప్రజలు ఛీకొట్టారని విమర్శలు
MLA Roja criticizes Chandrababu and Lokesh in assembly session

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా మహిళా సాధికారత అంశంపై మాట్లాడుతూ విపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు మహిళలను కించపర్చారని, ఆయనొక మహిళా ద్రోహి అని విమర్శించారు. 40 ఏళ్ల నుంచి ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును కుప్పంలో కూడా ఛీకొట్టారని వ్యాఖ్యానించారు. వీధి రౌడీల్లా ప్రవర్తించిన చంద్రబాబు, లోకేశ్ వీధి వీధికి తిరిగినా ఫలితం లేకపోయిందని, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పుడు వారిద్దరూ మూటాముల్లె సర్దుకుని హైదరాబాదు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

అంతకుముందు రోజా సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మహిళల తలరాతలనే మార్చే పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు. రాజకీయాల్లో జగన్ లా మహిళలను ప్రోత్సహించే వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. అమ్మ జన్మనిస్తే, సీఎం జగన్ జీవితాన్నిచ్చాడని అన్నారు. ఏపీలో ఎంతమంది నేతలు ఉన్నా జగనన్న తర్వాతే ఎవరైనా అని కీర్తించారు.

More Telugu News