Madhya Pradesh: కులాంతర వివాహం చేసుకున్న కుమార్తె.. అత్యాచారం చేసి చంపేసిన తండ్రి

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో ఘటన
  • ఏడాది క్రితం కుమార్తె ప్రేమ పెళ్లి
  • అడవికి తీసుకెళ్లి అత్యాచారం, ఆపై గొంతు నులిమి హత్య
Man rapes and kills daughter over inter caste love marriage

కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి దారుణ చర్యకు ఒడిగట్టాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై కర్కశంగా చంపేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ జిల్లాలోని రాటీబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాలలోకి వెళితే, ఇటీవల బాధిత మహిళ 8 నెలల కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు నిందితుడు కూతుర్ని సమీపంలోని సంసాగఢ్ అటవీ ప్రాంతంకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆమె చేసుకున్న ప్రేమ వివాహంపై అక్కడ తండ్రీకుమార్తెల మధ్య వాగ్వివాదం జరిగింది.

దీంతో కోపోద్రిక్తుడైన 55 ఏళ్ల ఆమె తండ్రి.. కుమార్తె అన్న విచక్షణ కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశాడు. బాధిత మహిళ, అనారోగ్యంతో చనిపోయిన ఆమె 8 నెలల కుమారుడి మృతదేహాలు రెండు రోజుల క్రితం ఆ అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News