Ravana: రావణుడు విమానంలో శ్రీలంక నుంచి భారత్ కు ప్రయాణించాడా...?: శ్రీలంక ప్రభుత్వం పరిశోధన

  • రామాయణ గాథలో విమానం ప్రస్తావన
  • రావణుడి వద్ద ఉండేదని ఇతిహాసాల్లో పేర్కొన్న వైనం
  • రెండేళ్ల కిందట పరిశోధన ప్రారంభించిన శ్రీలంక ప్రభుత్వం
  • భారత్ కూడా చేయి కలపాలని విజ్ఞప్తి
Sri Lanka believes Ravana traveled India in a plane

లంకాధిపతి రావణాసురుడు విమానంలో ప్రయాణించేవాడని రామాయణ ఇతిహాసం చెబుతోంది. భూమండలంపై మొట్టమొదట విమానాన్ని వినియోగించింది రావణుడేనని శ్రీలంక ప్రజలే కాదు, అక్కడి ప్రభుత్వం కూడా బలంగా విశ్వసిస్తోంది. అంతేకాదు, దీనిపై పరిశోధన కోసం శ్రీలంక గత రెండేళ్లుగా కృషి చేస్తోంది. సివిల్ ఏవియేషన్ నిపుణులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులతో గతంలో ఓ సమావేశం ఏర్పాటు చేయగా, రావణుడు శ్రీలంక నుంచి భారత్ కు విమానంలోనే ప్రయాణించాడని నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చారు. తీవ్ర చర్చలు జరిగిన అనంతరం ఈ మేరకు తీర్మానించారు.

దీనిపై పరిశోధన కోసం లంక ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరిశోధనకు మధ్యలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో 2022లో పరిశోధన పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, ఈసారి తమ పరిశోధనలో భారత బృందం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక వర్గాలు ఆకాంక్షను వ్యక్తం చేశాయి. కాగా రావణుడి గాథలో విమానం అంశం ఓ కట్టుకథ అని చాలామంది కొట్టిపారేస్తుండడం తెలిసిందే.

More Telugu News