Warangal: వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. ఫ్రెషర్స్ డే పేరుతో తాగి వేధిస్తున్నారంటూ మోదీ, షా, కేటీఆర్, డీజీపీకి విద్యార్థి ఫిర్యాదు

  • 2017 బ్యాచ్ విద్యార్థులు మద్యం తాగి వేధిస్తున్నారని ట్వీట్
  • అలాంటిదేమీ లేదన్న కళాశాల ప్రిన్సిపాల్
  • పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన మట్టెవాడ పోలీసులు
they are raging Warangal KMC Student tweets and tagging Modi

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో మరోమారు ర్యాగింగ్ కలకలం రేగింది. ఓ విద్యార్థి ట్వీట్‌తో నిన్న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్ విద్యార్థులు కొందరు మద్యం మత్తులో తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకుడిని ట్యాగ్ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్ చేశాడు.

2017 బ్యాచ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు మద్యం తాగి తమను వేధిస్తున్నట్టు ఆ ట్వీట్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, విద్యార్థి ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు కొట్టిపడేశారు. ర్యాగింగ్ వార్త నిజం కాదన్నారు. కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ భవనాలు దూరదూరంగా ఉంటాయన్నారు. సీనియర్ విద్యార్థులు కొందరు జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మరోవైపు, ఈ ఘటనపై ఆరా తీసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి నేడు కళాశాలలో జరగాల్సిన ఫ్రెషర్స్ డేకు అనుమతి ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు నిన్న కేఎంసీలో విచారణ జరిపారు. ర్యాగింగ్‌పై విద్యార్థులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

More Telugu News