Evaru Meelo Koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న భద్రాద్రి కొత్తగూడెం ఎస్సై!

  • ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో
  • కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి ఫిక్స్ చేయమన్న రాజారవీంద్ర
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో
  • రేపు ప్రసారం కానున్న షో
Bhadrardri dist SI Won One Crore in Evaru meelo koteeswarulu

జెమినీ టీవీ చానల్‌లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం.

హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ షో రేపు ప్రసారం కావాల్సి ఉండగా, రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న విషయంపై షో నిర్వాహకులు ఇంకా పెదవి విప్పకపోవడంతో సస్పెన్స్‌గా మారింది.

More Telugu News