SI Rajeswari: చెన్నైలో ఎస్సై రాజేశ్వరి ఆసుపత్రికి తరలించిన వ్యక్తి విషాదాంతం

Man who was saved by SI Rajeswari in Chennai died in hospital
  • ఇటీవల చెన్నైలో భారీ వర్షాలు
  • శ్మశానం వద్ద విరిగిపడిన చెట్ల కింద అపస్మారక స్థితిలో వ్యక్తి
  • ఆసుపత్రికి తరలించిన మహిళా ఎస్సై
  • చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎస్సై
చెన్నైలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెట్లు విరిగిపడగా, ఓ శ్మశానవాటిక వద్ద ఉదయ్ కుమార్ అనే వ్యక్తి స్పృహలేని స్థితిలో కనిపించాడు. అతడిని మహిళా ఎస్సై రాజేశ్వరి తన భుజాలపై మోస్తూ ఆటోలో చేర్చి ఆసుపత్రికి తరలించారు. అతడిని కారులోకి చేర్చడం వీలుకాకపోవడంతో ఎస్సై అతడిని భుజాలపై వేసుకుని దూరంగా ఉన్న ఆటో వరకు నడుస్తూ వచ్చారు.

అయితే, ఆ ఎస్సై శ్రమ ఫలించలేదు. 25 ఏళ్ల ఉదయ్ కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయం తెలిసిన ఎస్సై రాజేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కాగా, ఆ మహిళా ఎస్సై యువకుడిని కాపాడిన వీడియో వైరల్ కావడంతో పోలీసు అధికారులు ఆమెను అభినందించారు. ఈ విషయం సీఎం స్టాలిన్ వరకు చేరింది. ఆయన ఎస్సై రాజేశ్వరిని తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. ఆమె మానవతా దృక్పథాన్ని కొనియాడుతూ ప్రశంసాపత్రం అందజేశారు.
SI Rajeswari
Uday Kumar
Death
Rains
Chennai

More Telugu News