New Delhi: ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాం.. ఢిల్లీ కాలుష్యంపై సీజేఐ రమణ అసహనం

  • సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
  • దీర్ఘకాలిక ఎమర్జెన్సీ ప్రణాళికను రూపొందించండి
  • రెండు రోజుల లాక్ డౌన్ ఏమైనా పెడతారా?
  • కేవలం పంట వ్యర్థాలతోనే కాలుష్యం జరగట్లేదు
  • కారణాల్లో అదీ ఒకటంతే
  • మిగతా వాటి సంగతేంటి?
CJI NV Ramana Angry Over Delhi Pollution Asks Center To Come Up With A Emergency Plan

వారం రోజులుగా ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. బయటకెళ్తే ఊపిరి తీసుకోలేని పరిస్థితి. కనీసం ఇంట్లో ఉంటేనైనా బాగుంటుందేమో అనుకుంటే.. ఇంట్లోనూ అదే పరిస్థితి. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించేందుకు దీర్ఘకాలిక ఎమర్జెన్సీ ప్రణాళికను రూపొందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాడివేడి వాదనలు సాగాయి.

ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, కనీసం ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నామని జస్టిస్ రమణ అన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు, వాయు నాణ్యతను పెంచేందుకు ఎలాంటి ఎమర్జెన్సీ చర్యలు చేపడుతున్నారో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీలో రెండు రోజుల లాక్ డౌన్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ఇవాళ సాయంత్రం నాటికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు సమావేశం నిర్వహించాలని, కాలుష్య నియంత్రణపై చర్యలను చేపట్టాలని ఆయన ఆదేశించారు. కేంద్రం, రాష్ట్రాలు అని పోటీ పెట్టుకోకుండా.. అన్ని ప్రభుత్వాలూ కలసికట్టుగా కాలుష్య నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కనీసం ఈ రెండు మూడు రోజుల్లోనైనా సమస్య సద్దుమణుగుతుందని తాము ఆశిస్తున్నామన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. ఢిల్లీలో వాతావరణం బాగాలేదన్న విషయాన్ని ఒప్పుకుంటున్నామని, ఆ గాలి పీలిస్తే రోజూ 20 సిగరెట్లు కాల్చినట్టని అన్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. పంజాబ్ లో పంట వ్యర్థాలను తగులబెట్టడం ఎక్కువైనందువల్లే కాలుష్య తీవ్రత పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు.

ఆయన వ్యాఖ్యలపై సీజేఐ రమణ అసహనం వ్యక్తం చేశారు. కాలుష్యానికి కేవలం రైతులనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారని నిలదీశారు. కాలుష్యానికి అది కూడా ఒక కారణమే తప్ప.. మొత్తం కాలుష్యానికి అది కారణం కాదు కదా? అని ప్రశ్నించారు. కాలుష్యానికి కారణమవుతున్న మిగతా అంశాల సంగతేంటి? అని అన్నారు.

రైతులకు సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, సబ్సిడీ ఇస్తున్నా చాలా మంది రైతులకు పంట వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే యంత్రాల కొనుగోలుకు శక్తి లేదని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు. రైతులపై నెపాన్ని నెట్టడం ప్రతి ఒక్కరికీ ఓ ఫ్యాషన్ అయిపోయిందని, టపాసులు నిషేధించినా ఐదారు రోజులుగా ఏం జరుగుతోందో చూడట్లేదా? అని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ మండిపడ్డారు.

అయితే, తాము రైతుల వల్ల కాలుష్యం జరుగుతోందని చెప్పలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా క్లారిటీ ఇచ్చారు. ధూళి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వానికి అందులో బాధ్యత ఉంటుందని అన్నారు. సోమవారం రాష్ట్రాల ప్రభుత్వాలూ అఫిడవిట్ ఫైల్ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ రమణ.. తానేదో చెబితే.. ఇంకోలా అనుకుని అంత సీరియస్ అవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పంట వ్యర్థాల వల్ల ఎంత కాలుష్యం జరుగుతుందన్నది తాను చెప్పలేదని, కానీ, దానికి వాటా ఉందన్నానని అన్నారు. మిగతాదంతా వాహనాల నుంచి విడుదలయ్యే పొగ, ధూళి కణాల వల్ల ఉంటోందని చెప్పారు.

కాలుష్యం వల్ల పిల్లలపైనా ప్రభావం పడుతోందని, ఇప్పటికే స్కూళ్లూ తెరుచుకున్నాయని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు. కొవిడ్, డెంగ్యూ, కాలుష్యం మధ్య పిల్లలను స్కూలుకు పంపించడం మంచిది కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పారని ఆయన గుర్తు చేశారు.

More Telugu News