Perni Nani: కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?... మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: పేర్ని నాని

  • తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • ఏపీ సీఎం కేంద్రం వద్ద అడుక్కుంటున్నారని విమర్శలు
  • రావాల్సిన నిధులను అడుగుతున్నామన్న పేర్ని నాని
  • మా మీద పడి ఏడవడం ఎందుకంటూ ఆగ్రహం
Perni Nani counters Telangana minister Prashant Reddy remarks

ఏపీ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులే ఆధారమని, కేంద్రం వద్ద ఏపీ సీఎం బిచ్చమెత్తుకుంటున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. నిధుల కోసం మేం కేంద్రం వద్ద అడుక్కుంటున్నామా... మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీకి వెళుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మీకు కేంద్రంపై కోపం ఉంటే ఏపీ మీద పడి ఏడవడం ఎందుకు? అని నాని ప్రశ్నించారు.

"మాకు రావాల్సిన నిధుల కోసమే కేంద్రాన్ని అడుగుతున్నాం. ప్రజాప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతేతప్ప ఇందులో దాచిపెట్టాల్సిందేమీ లేదు. మీలాగా బయట కాలర్ ఎగరేస్తూ లోపల కాళ్లు పట్టుకోము. అది జగన్ తత్వం కానే కాదు. తెలంగాణ అంత ధనిక రాష్ట్రం అయితే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి" అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

అంతేకాదు హైదరాబాదు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను సమష్టిగా అభివృద్ధి చేశారని, కానీ హైదరాబాద్ నుంచి అందుతున్న ఆదాయంతో ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు బాగుపడుతున్నారని అన్నారు.

More Telugu News