Lt Colonel Quazi Sajjad Ali Zahir: పాకిస్థాన్ మాజీ సైన్యాధికారికి 'పద్మశ్రీ' పురస్కారం.. ఏమిటి ఆయన గొప్పదనం?

  • పద్మశ్రీ పురస్కారం అందుకున్న పాక్ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ క్వాజీ సజ్జాద్ అలీ జహీర్
  • 1971లో పాక్ బోర్డర్ దాటి ఇండియాలోకి ప్రవేశించిన సజ్జాద్ అలీ
  • పాక్ సైన్యం వివరాలను ఇండియన్ ఆర్మీకి అందించిన అలీ
  • ఈస్ట్ పాకిస్థాన్ లో గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చిన వైనం
  • భారత్ కు చేసిన సేవలు, త్యాగాలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం
Why an ex Pakistan army officer Lt Colonel Zahir was honoured with Padma Shri

దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇటీవలే అందజేసింది. తమతమ విభాగాల్లో అత్యున్నత సేవలందించిన వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కరాలను అందించారు. అయితే, ఈ అవార్డులు అందుకున్న వారిలో అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించిన వ్యక్తి లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) క్వాజీ సజ్జాద్ అలీ జహీర్. పాకిస్థాన్ ఆర్మీలో సైన్యాధికారిగా పని చేసిన ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయనను మన దేశం ఇంత గొప్ప పురస్కారంతో ఎందుకు సత్కరించింది? ఆయన విశిష్టత ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.

1971లో 20 ఏళ్ల పాకిస్థాన్ యువ ఆర్మీ ఆఫీసర్ సజ్జాద్ అలీ జహీర్ ఇండియా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద సియాల్ కోట్ సెక్టార్ లో బోర్డర్ దాటి మన దేశంలోకి ప్రవేశించారు. ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో మారణహోమాన్ని సృష్టించేందుకు పాకిస్థాన్ ప్లాన్ చేస్తున్న తరుణంలో ఆయన బోర్డర్ దాటారు. అప్పుడు ఆయన బూట్లలో పాకిస్థాన్ సైనికులు మోహరించి ఉన్న ప్రాంతాల మ్యాపులు, ఇతర మిలిటరీ డాక్యుమెంట్లతో పాటు జేబులో 20 రూపాయలు ఉన్నాయి. బోర్డర్ దాటిన ఆయనను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయనను పాక్ గూఢచారిగా మన సైన్యాధికారులు భావించారు.

ఆయన బోర్డర్ దాటే సమయంలో పాక్ సైనికులు భారత సైనికులపై కాల్పులు జరుపుతున్నారు. వారి కాల్పులను తిప్పి కొడుతూ భారత సైనికులు కూడా ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇదే సమయంలో సజ్జాద్ సరిహద్దులను దూకి భారత భూభాగంలోకి ప్రవేశించారు. ఆయన సరిహద్దులను దాటడాన్ని ఇరువైపు బలగాలు గమనించలేదు. అయితే కాసేపటి తర్వాత ఆయన భారత బలగాల చేతికి చిక్కారు. మన సైనికులు ఆయనను పఠాన్ కోట్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను సీనియర్ సైన్యాధికారులు విచారించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సైన్యం ఎక్కడెక్కడ మోహరించిందనే వివరాలతో పాటు ఇతర సమాచారాన్ని భారత అధికారులతో ఆయన పంచుకున్నారు.

ఆ తర్వాత ఆయనను ఢిల్లీకి తరలించారు. కొన్ని నెలల పాటు ఆయనను ఢిల్లీలో ఒక సురక్షితమైన ఇంట్లో ఉంచారు. ఆయనతో రాత్రింబవళ్లు సీనియర్ ఆర్మీ అధికారులు పలు విషయాలపై చర్చలు జరిపేవారు. అనంతరం ఆయనను ఈస్ట్ పాకిస్థాన్ (బంగ్లాదేశ్)కు తరలించారు. అప్పటికే పాకిస్థాన్ అరాచక పాలనపై ఈస్ట్ పాకిస్థాన్ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముక్తి బాహిని (పోరాటయోధులు)కి ఆయన గెరిల్లా యుద్ధ విద్యలో ట్రైనింగ్ ఇచ్చారు. అదే సంవత్సరం (1971)లో భారతదేశం అండతో పాకిస్థాన్ సైన్యాన్ని చిత్తుచేసి ఈస్ట్ పాకిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్ గా స్వయంపాలన కిందకు వచ్చింది.

దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో చేసిన సజ్జాద్ అలీ జహీర్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం స్వాధినాథ పాదక్ తో సత్కరించింది. మిలిటరీ పంరగా మన వీర్ చక్రతో సమానమైన బీర్ ప్రోతిక్ తో గౌరవించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గత 50 ఏళ్లుగా పాకిస్థాన్ లో ఆయనపై మరణశిక్ష పెండింగ్ లో ఉంది. అయితే ఈ మరణశిక్షను కూడా తాను ఎంతో గౌరవంగా భావిస్తానని ఆయన అంటుంటారు.

1971లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో భారత్ కు చేసిన సహకారం, త్యాగాలకు గుర్తింపుగా... మన ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆ యుద్ధం జరిగి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ లు విజయోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాయి. ఈ వేడుకల సందర్భంగా సజ్జాద్ ను మన ప్రభుత్వం సగౌరవంగా సత్కరించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.... 1971 నాటి యుద్ధ విజయోత్సవాలను జరుపుకుంటున్న ఈ ఏడాదే సజ్జాద్ 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

తన గత చరిత్ర గురించి సజ్జాద్ మాట్లాడుతూ, పాకిస్థాన్ జాతిపిత జిన్నా అరాచకత్వంపై మండిపడ్డారు. అప్పట్లో జరిగిన ప్రతి ఒక్క దారుణం తన మెదడులో నిక్షిప్తమై ఉందని చెప్పారు. పాకిస్థాన్ నుంచి తాను పారిపోయి రావడానికి గల కారణాలను చెపుతూ... జిన్నాకు చెందిన పాకిస్థాన్ తమ మాతృభూమిని శ్మశానంగా మార్చిందని అన్నారు. తాము రెండో తరగతి ప్రజల్లా పరిగణించబడేవాళ్లమని చెప్పారు. తమ ప్రజలు తీవ్ర వంచనకు గురయ్యారని, తమకు ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. పాకిస్థాన్ కు, ఈస్ట్ పాకిస్థాన్ కు సమాన హక్కులు ఉంటాయని జిన్నా చెప్పేవారని... కానీ తమకు ఎలాంటి హక్కులు లభించలేదని చెప్పారు. పాకిస్థాన్ కు బానిసలుగా తమను చూసేవారని అన్నారు. పాకిస్థాన్ సైనికులు మానభంగాలు, హత్యలు, దోపిడీలు, మారణహోమాలకు పాల్పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ సియాల్ కోట్ లో తాను అత్యున్నత అధికారిగా ఉన్నప్పటికీ... ఏకాకి అనే భావనతో ఉండేవాడినని చెప్పారు. అక్కడ ఉండలేక పాకిస్థాన్ నుంచి బయటపడాలని అనుకున్నానని అన్నారు. దీంతో సరిహద్దులు దాటి భారత్ లోకి అడుగుపెట్టానని చెప్పారు.

ప్రస్తుత బంగ్లాదేశ్ లోని కోమిల్లా జిల్లాలో 1951లో క్వాజీ సజ్జాద్ అలీ జహీర్ జన్మించారు. సజ్జాద్ తండ్రి కూడా బ్రిటీష్ ఆర్మీలో పని చేశారు. ఆయన సోదరుడు ముక్తి బాహినిలో సభ్యుడిగా బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం పోరాడారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్ భూభాగంలోకి 56 మైళ్లు భారత సైన్యం చొచ్చుకుపోయిందని చెప్పారు. బంగ్లాదేశ్ లో పట్టుబడిన పాకిస్థాన్ సైనికులను భారత బలగాలు కాపాడాయని... లేకపోతే వారంతా ముక్తి బాహిని చేతుల్లో హతమయ్యేవారని తెలిపారు. తమను కాపాడారనే విశ్యాసం కూడా లేకుండా పాకిస్థాన్ సైన్యం భారత్ పై కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కార్గిల్ తో పాటు భారత్ కు చెందిన పలు ప్రాంతాలపై దాడులకు తెగబడిందని విమర్శించారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ యువతకు ఆయన చురకలు అంటించారు. 1971లో సాధించిన విజయం అత్యద్భుతమైనదని... ఇండియా, బంగ్లాదేశ్ లకు అదొక గొప్ప సమయమని చెప్పారు. అలాంటి గొప్ప విజయం గురించి ఇప్పటి తరాలు తెలుసుకోలేకపోతున్నాయని... తల్లిదండ్రులందరూ వారి పిల్లలకు 1971 గురించి చెప్పాలని అన్నారు. బంగ్లాదేశ్ అవతరణలో భారత్ అత్యంత కీలకపాత్ర పోషించిందని కొనియాడారు.

ఇదండీ... అప్పట్లో ఒక 20 ఏళ్ల యువ పాకిస్థాన్ ఆర్మీ అధికారి జీవిత కథ. పాక్ పై భారత్ సాధించిన విజయంలో ఆయన అందించిన సమాచారం, ఆర్మీ వివరాలు ఎంతో దోహదపడ్డాయి. ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ మన దేశం ఆయనను సగౌరవంగా పద్మశ్రీతో సత్కరించింది.

More Telugu News