Gajendra Singh Shekhawat: కొత్త ట్రైబ్యునల్ పై జాప్యానికి కేసీఆరే కారణం: కేంద్రమంత్రి షెకావత్

  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • కేంద్రమంత్రి షెకావత్ ప్రెస్ మీట్
  • తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు
  • కొత్త ట్రైబ్యునల్ కోసం కేసీఆర్ డిమాండ్ చేశారని వెల్లడి
Union Jal Shakti minister Gajendra Singh Shekhawat press meet

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ ఎదుట లేవనెత్తిన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారని వెల్లడించారు. ట్రైబ్యునల్ కోసం కేసీఆర్ గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమని కేసీఆర్ కు స్పష్టం చేశామని షెకావత్ వివరించారు.

రెండ్రోజుల్లో పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ అప్పట్లో చెప్పారని, కానీ 8 నెలల వరకు ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోలేదని వెల్లడించారు. తాజాగా నెలరోజుల కిందట ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారని వివరించారు. కేసీఆర్ కారణంగానే ట్రైబ్యునల్ పై నిర్ణయం ఆలస్యమైందని పేర్కొన్నారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో కేంద్రాన్ని నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై తాము కేంద్ర న్యాయశాఖ సలహా కోరామని, కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ సుదీర్ఘమైనదని కేంద్రమంత్రి షెకావత్ తెలిపారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు.

More Telugu News