Madhya Pradesh: కోటి రూపాయల బీమా కొట్టేసేందుకు ప్లాన్.. బతికుండగానే చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రం

  • మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఘటన
  • తొలుత కోటి రూపాయలకు బీమా
  • రెండు వాయిదాలు చెల్లించాక కోటి కొట్టేసేందుకు ప్రణాళిక
  • కుటుంబం మొత్తం కటకటాల్లోకి
Man in Madhya Pradesh Arrested for for cheating insurance company

బతికుండగానే మరణ  ధ్రువీకరణ పత్రం సృష్టించి ఆపై కోటి రూపాయల బీమాను కొట్టేయాలనుకున్న ఓ వ్యక్తి పన్నాగం బయటపడింది. ఇప్పుడతడు, అతని కుటుంబ సభ్యులు తీరిగ్గా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. హనీఫ్ (46) సెప్టెంబరు 2019లో ఓ బీమా కంపెనీలో కోటి రూపాయల విలువైన బీమా పాలసీ తీసుకున్నాడు. రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత ఆ కోటి రూపాయల బీమాను కొట్టేయాలని భావించాడు. ఇందుకోసం వైద్యుడు షకీర్ మన్సూరితో కలిసి పన్నాగం పన్నాడు. తాను మరణించినట్టు మరణ ధ్రువీకరణ పత్రాలను రెడీ చేసుకున్నాడు.

తర్వాత వాటిని బీమా కంపెనీకి సమర్పిస్తూ, హనీఫ్ భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారి వ్యవహారాన్ని అనుమానించిన సదరు బీమా సంస్థ దేవాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో హనీఫ్ బతికి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో హనీఫ్, రెహానా, ఇక్బాల్‌తోపాటు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News