KTR: పోడు భూములపై మంత్రి కేటీఆర్ సమీక్ష... అధికారులకు సీరియస్ వార్నింగ్

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల అవగాహన సదస్సు
  • హాజరైన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు
  • తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడతాయన్న కేటీఆర్
  • రాజకీయాలకు అతీతంగా వెళుతున్నామని వెల్లడి
KTR attends seminar on forest agri lands

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నేడు నిర్వహించిన పోడు భూముల అవగాహన సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోడు భూముల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. పోడు రైతుల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందని భావిస్తే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.

పోడు భూముల పేరిట డబ్బులు వసూలు చేస్తే జైలు తప్పదని, హక్కు పత్రాల పేరుతో అక్రమాలు చేస్తే కఠినచర్యలు ఉంటాయని అన్నారు. అధికారులు తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఉద్యోగాల నుంచి తొలగించడం ఖాయమని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యాచరణ చేపడుతున్నామని, ఇందులో తమ ప్రభుత్వానికి మరో ఉద్దేశమేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రమేశ్ బాబు కూడా హాజరయ్యారు.

More Telugu News