Nara Lokesh: ప్రజలందరూ మీ వెంటే ఉంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎందుకు?: నారా లోకేశ్

  • స్థానిక ఎన్నికల్లో ఘటనలపై లోకేశ్ స్పందన
  • సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్లు
  • తమ అభ్యర్థులపై దాడులు ఎందుకంటూ ఆగ్రహం
  • ఈ హిట్లర్ గిరీ ఎందుకంటూ మండిపాటు
Nara Lokesh slams CM jagan and YCP

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్ర ప్రజలంతా మీవైపే ఉంటే తిరుపతి ఉప ఎన్నికలకు దింపిన వేలమంది దొంగ ఓట్ల పర్యాటకులను బద్వేలులోనూ ఎందుకు దింపాల్సి వచ్చింది? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

"స్థానిక సంస్థల్లో 85 శాతం ప్రజలు మావైపే ఉన్నారని మీరు ప్రకటిస్తారు... కానీ 80 ఏళ్ల మా అంజిరెడ్డి తాత నామినేషన్ పత్రాలు చించేస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎదురులేని ప్రజాబలం అని ఉత్తర కుమారుడిలా మీరు రాసిన ఉత్తరాలను సలహాల సజ్జల మీడియాకు వినిపిస్తారు.

వైసీపీకి అంత ప్రజాబలమే ఉంటే కుప్పం మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళుతున్న వెంకటేశ్ పై వైసీపీ వర్గీయులు దాడి చేసి నామినేషన్ పత్రాలు ఎందుకు లాక్కున్నారు? అటు, తూర్పు గోదావరి జిల్లా కాచవరం పంచాయతీ 1వ వార్డుకు వేసిన నామినేషన్ ను వెనక్కి తీసుకోవాలంటూ గిరిజన మహిళ శిరీషను వైసీపీ నేత వెంకన్న ఎందుకు బెదిరించారు? గురజాల నగర పంచాయతీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన మైనారిటీ మహిళ నజీమున్ పై ఎందుకు దాడి చేశారు?

వైసీపీది అసలైన ప్రజాబలమే అయితే పంచాయతీ నుంచి పార్లమెంటు స్థానం వరకు గెలుపు కోసం ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాల్సిన అవసరం ఏమిటి? ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగం, పోలీసులను వాడుకుని పోటీ అనేదే లేకుండా చేయాలనే ఈ హిట్లర్ గిరీ ఎందుకు?" అంటూ లోకేశ్ నిలదీశారు.

More Telugu News