Matthew Cross: యావత్ భారతదేశం ఇప్పుడు నీ వెంట ఉంది: సహచర ఆటగాడితో స్కాట్లాండ్ వికెట్ కీపర్ వ్యాఖ్యలు వైరల్

  • కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్
  • మిణుకుమిణుకుమంటున్న భారత్ ఆశలు
  • ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి
  • స్కాట్లాండ్ వికెట్ కీపర్ వ్యాఖ్యలే నిదర్శనం
Scotland wicket keeper comments recorded in stump microphone went viral

ఐసీసీ ర్యాంకింగ్ ల పరంగా కానీ, ఆటతీరు పరంగా కానీ టీమిండియా అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి జట్టు. అయితే యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. సూపర్-12 దశలో తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. దాంతో, సెమీస్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆశగా ఎదురుచూస్తోంది.

టీమిండియా సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ లో తప్పనిసరిగా ఓడిపోవాలి. మొన్న స్కాట్లాండ్ తో మ్యాచ్ లో ఓటమి దరిదాపుల్లోకి వెళ్లిన కివీస్ ఎలాగో నెగ్గింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్ వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ తమ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ ను ఉద్దేశించి అన్న మాటలు స్టంప్ మైక్రోఫోన్ ద్వారా రికార్డయ్యాయి. 7వ ఓవర్ జరుగుతుండగా... "కమాన్ గ్రీవ్స్... ఇప్పుడు యావత్ భారతదేశం నీవెంటే ఉంది. రెచ్చిపో!" అంటూ ఉత్సాహపరిచాడు.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారని స్కాట్లాండ్ వికెట్ కీపర్ ఆ విధంగా పరోక్షంగా చెప్పాడు. ఒకవేళ న్యూజిలాండ్ నిజంగానే ఆ మ్యాచ్ ఓడిపోయుంటే భారతీయులు పండగ చేసుకునేవారే! కానీ, ఫలితం మరోలా వచ్చింది.

More Telugu News