Telangana ENC: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసిన తెలంగాణ

  • ఏపీపై తెలంగాణ ఫిర్యాదుల పరంపర
  • ఆర్డీఎస్ పనులకు ఏపీ అడ్డు తగులుతోందని ఆరోపణ
  • కర్ణాటకను ఏపీ అడ్డుకుంటోందని వెల్లడి
  • ఆనకట్ట పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని వినతి
Telangana ENC shot another letter to KRMB chairman

ప్రాజెక్టుల విషయంలో ఏపీపై తెలంగాణ ప్రభుత్వం తన ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు మరోసారి లేఖ రాసింది. రాజోలిబండ హెడ్ వర్క్స్ ను బోర్డు పరిధిలోకి తీసుకురావాలంటూ తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తమ లేఖలో కోరారు.

ఆర్డీఎస్ ఆనకట్ట పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆనకట్ట పనులు చేయకుండా కర్ణాటకను ఏపీ అడ్డుకుంటోదని ఆరోపించారు. శాంతిభద్రతల పేరుతో పనులకు ఏపీ అడ్డుతగులుతోందని వివరించారు. ఆనకట్ట ఆధునికీకరణ జరగకపోవడం వల్ల మూడో వంతు నీరు రావడంలేదని తెలిపారు. కేసీ కెనాల్ ద్వారా అదనపు నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు చేశారు.

కేంద్రం ఇటీవల కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్వచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి తెలంగాణ లేఖల జోరు పెంచింది.

More Telugu News