Allu Arjun: పునీత్ మా ఇంటికి వచ్చేవారు.. కలిసి భోజనం చేసేవాళ్లం: గుర్తు చేసుకున్న అల్లు అర్జున్

  • ‘పుష్పక విమానం’ ట్రైలర్ విడుదల సందర్భంగా సంతాపం
  • ఓ డ్యాన్స్ కార్యక్రమానికి ఇద్దరం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించాం
  • ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు: అల్లు అర్జున్
  • పునీత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది: విజయ్ దేవరకొండ
Allu Arjun and Vijay Devarakonda Remembers Puneeth Rajkumar

శాండల్‌వుడ్ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) మృతికి టాలీవుడ్ నటులు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సంతాపం తెలిపారు. నిన్న ‘పుష్పక విమానం’ సినిమా ట్రైలర్‌ను అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు పునీత్‌కు సంతాపం తెలిపారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పునీత్‌తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవమని అన్నారు. పునీత్ తన ఇంటికి వచ్చేవారని, ఇద్దరం కలిసి భోజనం చేసేవారమని గుర్తు చేసుకున్నారు. ఓ డ్యాన్స్ కార్యక్రమానికి తామిద్దరం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినట్టు చెప్పారు.

తామిద్దరం ఎప్పుడు కలుసుకున్నా తనను బెంగళూరు రమ్మనేవారని అల్లు అర్జున్ అన్నారు. పునీత్ ఓ గొప్ప వ్యక్తని, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ఆయన గర్వకారణమని అన్నారు. అలాంటిది ఇక ఆయన లేరన్న విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పునీత్ ఆహ్వానం మేరకు కొన్నాళ్ల క్రితం తాను ఆయన ఇంటికి వెళ్లానని, మూడు గంటలపాటు ఇద్దరం మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తనను కలచివేసిందన్నారు. ఏదో ఒకరోజు మనం కూడా వెళ్లిపోవాల్సిందేనని, ఉన్నన్నాళ్లు కలిసి పనిచేద్దామని, సంతోషంగా ఉందామని, ప్రేమిస్తూ ఇతరులకు మద్దతుగా నిలుద్దామని విజయ్ అన్నారు.

More Telugu News