Shankar: రూటు మార్చేసిన స్టార్ డైరెక్టర్లు!

  • దర్శకులకు అనేక బాధ్యతలు
  • ప్రాజెక్టు ఆగిపోతే బాధితులు
  • స్క్రిప్ట్ రెడీగా పెట్టుకుంటున్న దర్శకులు
  • గ్యాప్ రాకుండా ప్లానింగ్  
Maruthi Special News

సాధారణంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమాను చేస్తుంటారు. స్టార్ హీరోయిన్లు మాత్రం ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేస్తారు. ఎందుకంటే సినిమాల్లో హీరోయిన్ పోర్షన్ తక్కువగా ఉంటుంది .. అంతే కాకుండా వాళ్లకి ఇతర భాషల్లోను చేసే అవకాశం ఉంటుంది. అందువలన కెరియర్ పరంగా వాళ్లు దూసుకుపోతుంటారు. ఇక ఏదైనా ఒక కారణంగా ఒక ప్రాజెక్టు ఆగిపోయినా, కెరియర్ పరంగా వాళ్లకి కలిగే నష్టం ఏముండదు. మిగతా ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు.

కానీ ఒక దర్శకుడు సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అన్నీ రాసుకుని, అన్ని వైపులా నుంచి అందరినీ ఒప్పిస్తూ అతి కష్టం మీద ఒక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడు. ఆ సినిమా పూర్తయ్యేవరకూ ఆయన మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరం ఎదురైనా అయోమయంలో పడిపోవలసిందే. ఇది నిన్నమొన్నటివరకూ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.

'ఇండియన్ 2' సినిమా షూటింగు ఆగిపోగానే శంకర్ .. చరణ్ ను తీసుకుని సెట్స్ పైకి వెళ్లిపోయాడు. 'హరిహర వీరమల్లు' షూటింగు నిలిచిపోతే, వెంటనే క్రిష్ 'కొండ పొలం' సినిమాను చేసి వదిలాడు. అలాగే మారుతి కూడా 'పక్కా కమర్షియల్' సినిమా కరోనా కారణంగా ఆగిపోతే, అది తిరిగి మొదలయ్యేలోగా 'మంచిరోజులు వచ్చాయి' చేశాడు. దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఇకపై దర్శకులు ఒక ప్రాజెక్టును మాత్రమే పట్టుకుని వేళ్లాడరనే విషయం అర్థంకావడం లేదూ!

More Telugu News