Hyderabad: గంజాయి చెకింగ్ పేరిట ప్రయాణికుల ఫోన్లను చెక్ చేస్తున్న పోలీసులు!

  • ఆటోలు, బైకులపై వెళ్తున్న వారి వాట్సాప్ చాటింగ్ల తనిఖీ
  • వైరల్ గా మారిన పోలీసుల తనిఖీ వీడియో
  • గోప్యతా హక్కులకు భంగమంటున్న నిపుణులు
  • హరించామనడం సమంజసం కాదన్న హైదరాబాద్ సీపీ
  • అనుమానితులవి చెక్ చేయాల్సి ఉంటుందని కామెంట్
Hyderabad Police Check Phones and Whatsapp Chats of Commuters

హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. నిందితుడు రాజు ఆ తర్వాత రైలు పట్టాలపై శవమై కనిపించాడు. నిందితుడు గంజాయి మత్తులోనే చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని దర్యాప్తులో తేలింది. దీంతో సీఎం కేసీఆర్ ఇటీవల మంత్రి మండలి, అధికారులతో సమావేశమై గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు డ్రగ్స్, గంజాయిపై సీరియస్ గా ఉన్నారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ గంజాయి ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని ప్రాథమిక సూత్రాలను కాలరాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నిన్న హైదరాబాద్ ధూల్ పేటలో ప్రయాణికులను చెక్ చేసిన పోలీసులు.. వారి ఫోన్లనూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల వాట్సాప్ గ్రూపులు, వారి వ్యక్తిగత చాటింగ్ లను పరిశీలించారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ మండిపడుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం తమ చర్యలను సమర్థించుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించిన వారి ఫోన్లనే తనిఖీ చేస్తున్నామని చెప్పారు.

అయితే, సామాన్య ప్రయాణికులనూ పోలీసులు వదలని వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆటోల్లో ప్రయాణిస్తున్న వారి ఫోన్లు, బైకులపై వెళ్తున్న వారి ఫోన్లను తీసుకుని పోలీసులు తనిఖీ చేసినట్టు ఆ వీడియో తేటతెల్లం చేసింది. అంతేకాదు.. వారి ఫోన్లు తీసుకుని గంజా, వీడ్ వంటి పదాలను సెర్చ్ లో కొట్టి చూశారని తేలింది. కాల్ లిస్ట్, కాంటాక్ట్స్, సోషల్ మీడియా చాటింగ్ లను పరిశీలించినట్టు వెల్లడైంది.

దీనిపై ఐటీ నిపుణులు మండిపడుతున్నారు. ప్రజల ఫోన్లను చెక్ చేయడం, వాట్సాప్ చాటింగ్ లలోకి తొంగి చూడడం దారుణమైన నేరమని అంటున్నారు. ఇది కచ్చితంగా పౌరుల గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఒక వీడియోను పట్టుకుని ప్రజల గోప్యతా హక్కులను హరించామనడం సమంజసం కాదని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఇప్పటిదాకా తమ హక్కులకు భంగం కలిగించారంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో నిందితుల సమాచారాన్ని తెలుసుకోవడానికి అనుమానితుల ఫోన్లను పోలీసులు తనిఖీ చేసే అధికారం ఉంటుందని చెప్పారు.

More Telugu News