Gorantla Madhav: పట్టాభిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్
టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులు, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అంశాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ అధినేత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ... ఆయన జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉండటంతో సమావేశం కుదరలేదు. మరోవైపు అమిత్ షాను వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు కలిశారు. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారిని అసభ్య పదజాలంతో దూషించే వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని అమిత్ షాకు వినతిపత్రాన్ని అందజేశారు.