America: అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయం.. మనిషికి పంది కిడ్నీ అమర్చిన అమెరికా వైద్యులు

  • న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్ శాస్త్రవేత్తల ఘనత
  • బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిపై ప్రయోగం
  • జన్యు సవరణ చేసిన పంది నుంచి కిడ్నీ సేకరించిన వైద్యులు
  • తిరస్కరించని మానవ రోగ నిరోధక వ్యవస్థ
American Scientists transplant pigs kidney to a man

అవయవ మార్పిడిలో అమెరికా వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు. అవయవాల కొరతను అధిగమించడంలో భాగంగా మనిషికి పంది మూత్రపిండాన్ని అమర్చారు. అది చక్కగా తన పనితాను చేసుకుపోతుండడం గమనార్హం. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.

బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తిపై గత నెలలో అవయవ మార్పిడి ప్రయోగం చేపట్టారు. పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చిన తర్వాత మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. ఇది రోగ నిరోధకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని, సాధారణంగా పనిచేసిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడు డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరి పేర్కొన్నారు.

సాధారణంగా పంది కణాల్లోని గ్లూకోజ్ మనిషికి సరిపోదని, దీంతో మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ దానిని అంగీకరించదని తెలిపారు. ఈ నేపథ్యంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి కిడ్నీని సేకరించి మనిషికి అమర్చారు. పంది కిడ్నీలోని చెక్కెర స్థాయులను తగ్గించడం ద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ దానిని తిరస్కరించకుండా చూసుకున్నారు. ప్రస్తుతం ఇది చక్కగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

More Telugu News