India: భార‌త్‌పై చైనా కుట్ర‌లు.. భూటాన్‌తో ర‌హ‌స్య ఒప్పందం

  • చైనా, భూటాన్‌  దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒప్పందం
  • చైనా మూడు అంచెల ఒప్పందం ప్ర‌తిపాద‌న‌
  • చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంలో భూటాన్ చేరే అవ‌కాశం?
  • భార‌త స‌రిహ‌ద్దుల‌పై నిఘా పెట్ట‌డానికి  చైనాకు అవకాశం 
china sign on mou with bhutan

భార‌త్‌పై చైనా కుట్ర‌లు ప‌న్నుతూనే ఉంది. భార‌త్‌ను ఇరుకున పెట్ట‌డానికి ప్ర‌ణాళిక‌లు వేసుకుంటోంది. ఇటీవ‌ల ల‌డ‌ఖ్‌లోని ప‌రిస్థితుల‌పై భారత్, చైనా సీనియర్‌ సైన్యాధికారుల స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మావేశాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో చైనా కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంది.

భూటాన్‌తో కలిసి ఓ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. చైనా, భూటాన్‌  దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి చైనా మూడు అంచెల ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అందుకు భూటాన్‌ అంగీకరించింది. ఆ ఇరు దేశాల మ‌ధ్య 37 ఏళ్ల నుంచి సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికే ఈ ఒప్పందం తోడ్పడుతోంద‌ని చైనా చెబుతోంది.

అయితే, ఇందులో భాగంగా చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం (బీఆర్‌ఐ)లో భూటాన్‌ చేరితే అది భారత్‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంది. చైనా ప‌త్రిక‌ గ్లోబల్‌ టైమ్స్ ప‌లు అంశాల‌ను వివ‌రించింది. చైనా, భూటాన్ మ‌ధ్య కుదిరిన ఒప్పందం బీఆర్‌ఐ పథకంతో పాటు, చైనా సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపింది.

అయితే, భూటాన్‌తో  ఒప్పందం మేర‌కు చైనా ముందుకు వెళ్తే మన సరిహద్దులోని శిలిగుడి కారిడార్‌పై నిఘా పెట్ట‌డానికి చైనాకు అవకాశం దొరుకుతుంది. ఈ కారిడార్ మ‌న దేశ‌ భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలిపే అత్యంత కీలక ప్రాంతం కావడంతో ఆందోళ‌న నెల‌కొంది.  

భూటాన్‌ తో చైనా రహస్య చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. అంతేకాదు, భూటాన్‌తో ఒప్పందం కుదరడానికి ముందు రోజు చైనా సాయంతో పొందిన‌ క్షిపణులతో పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బ‌లోపేతం చేసుకుంది. శత్రు దేశ యుద్ధ విమానాలు పాక్‌ గగనతలంలోకి ప్రవేశిస్తే వాటిని కూల్చివేయడానికి చైనా అందించిన‌ ఈ క్షిపణి వ్యవస్థ పాక్‌కు తోడ్పడుతుంది.

More Telugu News