Sharwanand: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి ఫస్టు లుక్ రిలీజ్!

  • కిశోర్ తిరుమల నుంచి మరో ప్రేమకథ 
  • శర్వానంద్ జోడీగా రష్మిక 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు  
Adavallu Meeku Joharlu movie first look released

అందమైన ప్రేమకథల చుట్టూ ఆకట్టుకునే ఎమోషన్స్ ఉండేలా చూసుకోవడం దర్శకుడు కిశోర్ తిరుమల ప్రత్యేకత. ఆయన సినిమాల్లో స్నేహం .. ప్రేమ .. విరహం .. ఇవన్నీ కూడా ఫ్యామిలీ నేపథ్యానికి లోబడి నడుస్తాయి. 'రెడ్' సినిమాతో తన మార్కు కథకు భిన్నంగా వెళ్లిన ఆయన, ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయాడు.

తాజాగా ఆయన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా రష్మిక అలరించనుంది. తాజాగా 'విజయ దశమి' సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. పండుగ నేపథ్యానికి తగినట్టుగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. రాధిక .. ఉర్వశి .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News