Amit Shah: దేశంలో ముదురుతున్న ఇంధన సంక్షోభం.... విద్యుత్, బొగ్గు శాఖ మంత్రులతో అమిత్ షా కీలక సమావేశం

  • దేశంలో విద్యుత్ సమస్యలు
  • నిండుకుంటున్న బొగ్గు నిల్వలు
  • కరోనా ఆంక్షల ఎఫెక్ట్
  • అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం
  • భారత్ పైనా ప్రభావం
Amit Shah held meeting with power and coal ministers

దేశంలో అనేక రాష్ట్రాలు విద్యుత్, ఇంధన రంగ సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలతో నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలో విద్యుత్ స్థితిగతులు, బొగ్గు కొరతలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) అధికారులు కూడా పాల్గొన్నారు.

దేశంలో 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండగా, వాటిలో సగానికిపై కేంద్రాల్లో కేవలం మూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉండడం పట్ల కేంద్రం స్పందించింది. కరోనా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం భారత్ పైనా ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు.

దేశంలో విద్యుత్ వినియోగం అంతకంతకు పెరుగుతుండగా, సరిగ్గా అదేసమయంలో బొగ్గు నిల్వలు తరిగిపోతుండడం కేంద్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ, పంజాబ్, ఝార్ఖండ్, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో గగ్గోలు పెడుతున్నాయి.

More Telugu News