Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ ప్రైజ్

  • కార్డ్, ఆంగ్రిస్ట్, ఇంబెన్స్ లకు నోబెల్
  • సగం భాగం కార్డ్ కు, మరో సగం ఆంగ్రిస్ట్, ఇంబెన్స్ లకు!
  • బోధనా రంగంలో ఉన్న ముగ్గురు ఆర్థికవేత్తలు
Nobel Prize in Economics announced

ఆర్థికశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతిని పంచారు. ఒక సగం డేవిడ్ కార్డ్ కు, మిగతా సగం జాషువా డి ఆంగ్రిస్, గిడో డబ్ల్యూ ఇంబెన్స్ లకు పంచారు. డేవిడ్ కార్డ్ కార్మిక రంగ ఆర్థిక స్థితిగతులపై అనుభవవేద్యమైన సిద్ధాంతాలను ప్రతిపాదించగా... ఆంగ్రిస్, ఇంబెన్స్ లు ఆర్థిక నేపథ్యంలో సాధారణ సంబంధాల విశ్లేషణకు సిద్ధాంతపరమైన భాగస్వామ్యం అందించారు. వీరు రూపొందించిన డేటా మోడళ్లు అనేక పరిశోధనలకు ఊతమిచ్చాయి.

ఈ ఏడాది నోబెల్ విజేతల్లో ఒకరైన డేవిడ్ కార్డ్ కెనడియన్ అమెరికన్ కార్మిక రంగ ఆర్థిక నిపుణుడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

ఇక జాషువా ఆంగ్రిస్ట్ ఇజ్రాయెల్ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త. ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఆంగ్రిస్ట్ తో పాటు నోబెల్ ప్రైజ్ లో ఓ భాగాన్ని పంచుకున్న గిడో ఇంబెన్స్ డచ్ అమెరికన్ ఆర్థికవేత్త. ఆయన ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

More Telugu News