Assam: అసోం ముఖ్యమంత్రి హత్యకు కుట్ర.. రంగంలోకి దిగిన పోలీసులు!

  • ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యకు కుట్ర
  • తుపాకి, మూడు బుల్లెట్లు ఇచ్చిన వైనం
  • ఓ హోటల్ నుంచి బాధితుడిని రక్షించిన పోలీసులు
Police police busted murder plot on Assam CM Himanta Biswa Sarma

 అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడి చేతికి తుపాకి ఇచ్చి సీఎంను హత్య చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బెదిరిపోయిన ఆ వ్యక్తి తనను రక్షించాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.

అసోంలోని లఖింపూర్ జిల్లాకు చెందిన శరత్‌దాస్ ఈ వీడియోను షేర్ చేశారు. దీని ప్రకారం.. తాను దిమాపూర్ (నాగాలాండ్) నుంచి ఈ వీడియో చేస్తున్నానని, ఈ నెల 9న కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తనను కొందరు అపహరించి ఓ పిస్టల్, మూడు బుల్లెట్లు చేతికి అందించి ‘మామ’ (హిమంత బిశ్వశర్మ)ను చంపాలని ఒత్తిడి చేశారని, ఈ విషయం కనుక బయటకు తెలిస్తే తనను చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన డాక్యుమెంట్లతోపాటు రూ. 3 లక్షలు అపహరించారని వాపోయాడు. కిడ్నాపర్లు తనను హింసిస్తున్నారని పేర్కొన్నాడు. వీడియో వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. అసోం-నాగాలాండ్ సరిహద్దు ప్రాంతమైన ఖంఖతిలోని ఓ హోటల్‌లో శరత్ ఉన్నట్టు గుర్తించి రక్షించారు. వీడియోలో శరత్ చెప్పింది నిజమేనా? అన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News