Pawan Kalyan: బద్వేలు ఉప ఎన్నిక ఏకగ్రీవం చేసుకోండి... మేం అభ్యర్థిని నిలపడంలేదు: వైసీపీకి సూచించిన పవన్ కల్యాణ్

  • అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన
  • నాగులకనుమ వద్ద శ్రమదానం
  • బద్వేలు ఉప ఎన్నికపై స్పష్టత
  • జనసేన నేతలతో చర్చించామన్న పవన్
Pawan Kalyan clarifies on Budvel by elections

పవన్ కల్యాణ్ ఇవాళ ఏపీలో జనసేన శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న అనంతరం బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడంలేదని వెల్లడించారు.

మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని తెలిపారు.

అంతకుముందు పవన్ తనదైన శైలిలో ప్రసంగించారు. పాలకుల వద్ద డబ్బు ఉందని, కానీ వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జనసేనకు అధికారం ఇస్తే రాయలసీమలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయలసీమలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామని స్పష్టం చేశారు.  

నాకు అవకాశం ఇవ్వండి... మీ కష్టాల్లో తోడుంటాను అని పేర్కొన్నారు. వైసీపీ మంత్రులు, నేతలతో గొడవలు వద్దని, కోపాన్ని గుండెల్లో దాచుకోవాలని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సమయం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దామని అన్నారు. మీ అందరి కోసం కుటుంబాన్ని వదిలి వచ్చానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు.

More Telugu News