నాకు ఎంతమంది ఆశీస్సులు ఉన్నాయో ఎవరికీ తెలియదు: బండ్ల గణేశ్

You dont know who are behind me says Bandla Ganesh
  • 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేశ్
  • తాను గెలిస్తే 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించే ప్రయత్నం చేస్తానని వ్యాఖ్య
  • మన హీరోలు తలుచుకుంటే ఎన్ని భవనాలైనా కట్టొచ్చన్న గణేశ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా బండ్ల గణేశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేశ్... ఆ తర్వాత ప్యానల్ లోకి జీవిత రావడంలో బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.

ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తాను రాకెట్ లా దూసుకుపోతానని చెప్పారు. తాను గెలిస్తే కనీసం 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని తెలిపారు. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. తన వెనుక ఎవరున్నారో, ఎంతమంది ఆశీస్సులు ఉన్నాయో ఎవరికీ తెలియదని అన్నారు.

అసోసియేషన్ కు సొంత భవనం కావాలని బండ్ల గణేశ్ చెప్పారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతంలో ప్యాలస్ లాంటి భవనం కడతామంటే కుదరదని అన్నారు. కొంచెం దూరమైనా కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకుని... 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి స్థలం ఇవ్వాలని అడగాలని... ఆ స్థలంలో మన డబ్బులతో మనం కావాల్సింది చేసుకుందామని అన్నారు.

పేద కళాకారులకు ఇళ్లను కట్టించి ఇవ్వడం చాలా గొప్ప పని అని చెప్పారు. ఫండ్స్ కోసం ఎక్కడో విదేశాలకు వెళ్తామని చెపుతున్నారని... అంత అవసరం ఏముందని ప్రశ్నించారు. మన హీరోలు కోహినూర్ వజ్రాలు, బంగారు గనులని... ఆ వజ్రాలు ప్రకాశిస్తే ఎన్ని భవనాలైనా కట్టొచ్చని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏదైనా ప్రోగ్రాం నిర్వహించి... దాంతో వచ్చిన డబ్బులతోనే ఇళ్లు కట్టొచ్చని చెప్పారు.
Go Back to Shorts
Bandla Ganesh
Tollywood
MAA

More Telugu News