YV Subba Reddy: ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరం: వైవీ సుబ్బారెడ్డి

  • సేవా భావంతోనే జియో సంస్థ ఈ సేవలను అందించేందుకు ముందుకొచ్చింది
  • దర్శనం టికెట్ల బుకింగ్స్ లో సమస్యలు ఎదురవుతున్నాయి
  • వచ్చే నెల టీటీడీ డొమైన్ లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తాం
YV Subba Reddy response on JIO online ticket booking services

అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్ లో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సేవాభావంతోనే జియో సంస్థ ఈ సేవలను అందించడానికి ముందుకొచ్చిందని... జియో క్లౌడ్ ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు. అయితే, ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు.

స్వామివారి దర్శనం టికెట్ల బుకింగ్స్ లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని... దీన్ని అధిగమించేందుకు దాదాపు రూ. 3 కోట్ల విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలను అందించేందుకు జియో ముందుకొచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కొన్ని ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వచ్చే నెలలో పూర్తిగా టీటీడీ డొమైన్ లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, టికెట్ల బుకింగ్స్ పై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More Telugu News