China: ‘భారతీయులను తూట్లు పొడిచేస్తా’.. చైనాలో చిన్నారుల దుస్తులపై ద్వేషపూరిత రాతలు!

  • ‘నరకానికి స్వాగతం’ వంటి వాక్యాలు కూడా
  • భారతీయులకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు
  • జేఎన్‌బీవై అనేది చైనాలో ఒక పెద్ద బ్రాండ్
  • ఇదేంటని తీవ్రంగా ప్రశ్నిస్తూ ఫొటో షేర్ చేసిన ఒక తల్లి
Chines brand prints blow indians to pieces on children shirts

చైనాకు చెందిన ఒక భారీ కంపెనీ భారతీయులపై తన అక్కసును నీచ మార్గంలో వెళ్లగక్కింది. చిన్నపిల్లలు ధరించే దుస్తులపై భారతీయులను కించపరిచేలా, మనసులు గాయపడేలా వివిధ కామెంట్లు ప్రింట్ చేసింది. ఈ ప్రముఖ బ్రాండ్ పేరు జేఎన్‌బీవై. చైనాలో ఈ కంపెనీకి సుమారు 2 వేల స్టోర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా ఈ దుకాణాలు ఉన్నాయి.

ఇటీవల చైనాకు చెందిన మోగు మోగు అనే యువతి కొడుకుకి వాళ్ల తాతయ్య, నానమ్మ బ్రాండెడ్ దుస్తులు కొన్నారు. అయితే వారిద్దరికీ ఇంగ్లీష్ రాకపోవడంతో వాటిపై వున్న ప్రింటెడ్ రాతలకు అర్థం తెలియలేదు. కానీ మోగు మోగు ఈ టీషర్ట్ చూడగానే ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నరకానికి స్వాగతం’ అంటూ ప్రింట్ చేసిన దుస్తుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిందామె.

‘‘ఒక చిన్న పిల్లాడు ఇలాంటి మాటలున్న షర్టు ధరిస్తాడని తలచుకుంటేనే భయమేస్తోంది’’ అని ఆమె సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఒక ఫొటో షేర్ చేశారు. ‘ఈ ప్రాంతం మొత్తం భారతీయులతో నిండిపోయి ఉంది. నేను ఈ తుపాకీ తీసుకొని వాళ్లందర్నీ తూట్లు పొడిచేస్తా’ అంటూ ఆ దుస్తులపై ఓ స్లోగన్ ప్రింట్ చేసి ఉంది.

ఈ వివాదం బాగా వైరల్ అవడంతో జేఎన్‌బీవై కంపెనీ క్షమాపణ చెప్పింది. ఇలాంటి భయంకరమైన వాక్యాలు ఎలా ప్రింట్ అయ్యాయో తెలియదని, ప్రిటింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని వివరణ ఇచ్చింది. అయితే భారతీయులను కించపరుస్తూ చేసిన ప్రింట్లపై ఎటువంటి కామెంట్ చేయలేదు.

అయితే ఈ కంపెనీకి చెందిన దుస్తులపై ఇలా 2018 నుంచి భయంకరమైన వాక్యాలు కనిపిస్తున్నాయని మోగు మోగు ఆరోపించింది. దీని గురించి సోషల్ మీడియాలోనే కాకుండా, స్థానికంగా ఉన్న దుకాణం ముందు కూడా కొందరు నిరసన వ్యక్తం చేశారని తెలిపింది. అయినా సరే కంపెనీ తమ వైఖరి మార్చుకోలేదని విమర్శించింది. కాగా, గతేడాది భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన దాడుల్లో కొందరు భారత సైనికులు అమరులయ్యారు కూడా.

More Telugu News