Business: ఆ సంస్థలో ఉద్యోగం వారి జీవితాన్నే మార్చేసింది.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు

  • అమెరికా స్టాక్ ఎక్స్ చేంజ్ లో ‘ఫ్రెష్ వర్క్స్’ లిస్టింగ్  
  • కస్టమర్ సర్వీస్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ గా సేవలు
  • షేర్లకు అనూహ్య స్పందన
  • ప్రస్తుతం ఒక్కో షేరు 46.67 డాలర్లకు పైగా ట్రేడింగ్ 
  • ఒక్కరోజే వంద కోట్ల డాలర్ల సమీకరణ
The Employees In Chennai Company Turns Millionaires

2011లో ఆ సంస్థ చెన్నైలో ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికాకు విస్తరించింది. ఆ సంస్థలో చేరిన ఉద్యోగులు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అవును, కస్టమర్ సర్వీస్ సెంటర్లకు సాఫ్ట్ వేర్ ను తయారు చేసిచ్చే ఆ సంస్థ పేరు ‘ఫ్రెష్ వర్క్స్’. ఇటీవల ఐపీఓకు వెళ్లిన ఈ సంస్థ తన షేర్లను ఇవాళే అమెరికా స్టాక్ ఎక్స్ చేంజ్ ‘నాస్ డాక్’లో లిస్టింగ్ చేసింది.  

ఐపీఓ ద్వారా 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,372 కోట్లు) పైగా నిధులను సమీకరించింది. సంస్థ విలువ కూడా వెయ్యి కోట్ల డాలర్లకు (సుమారు రూ.73,728 కోట్లకు) పెరిగింది. ఈ క్రమంలో సంస్థలో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. కాగా, లిస్టింగు రోజునే సంస్థ షేర్ విలువ 46.67 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఐపీఓ సమయంలో సంస్థ ఒక్కో షేరుకు 36 డాలర్లుగా నిర్ణయించగా, అది 30 శాతం ఎక్కువగా ట్రేడ్ అవడం విశేషం. ఐపీవోలో భాగంగా 2.85 కోట్ల షేర్లను సంస్థ ప్రజలకు కేటాయించింది.

అంతేగాకుండా అండర్ రైటర్ల కోసం (నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉన్నవారు) అదనంగా 28.5 లక్షల క్లాస్ ఏ షేర్లను కొనుగోలు చేసేందుకు 30 రోజుల అవకాశాన్నీ కల్పించింది. అందులో భాగంగా ఐపీవో ధరలో అండర్ రైటింగ్ డిస్కౌంట్ లు, కమిషన్ల ఆఫర్ నూ అందిస్తోంది. ఈ లెక్కన అండర్ రైటర్లు తక్కువ ధరకే షేర్ ను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు గిరీశ్ మాత్రుబూతం మీడియాతో మాట్లాడారు. 2011లో సంస్థను స్థాపించినప్పుడు ఇంత వృద్ధిని తాము అస్సలు ఊహించలేదని ఆయన చెప్పారు. దీని తర్వాత మరిన్ని భారత సంస్థలు అంతర్జాతీయంగా ఎదుగుతాయన్న ఆశాభావం పెరిగిందన్నారు. సంస్థలోని 76 శాతానికి పైగా ఉద్యోగులకు షేర్లున్నాయని, భారత్ లోని 500 మందికిపైగా ఉద్యోగులు ఇప్పుడు కోటీశ్వరులయ్యారని చెప్పారు. అందులో 70 మందికిపైగా 30 ఏళ్ల లోపు వారేనన్నారు.

ఐపీవో ద్వారా వచ్చిన నిధులను సంస్థ విస్తరణ, పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు, క్యాపెక్స్, ఇతర అవకాశాల కోసం వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.

More Telugu News