Tollywood: సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్​ మృతి పట్ల సంతాపం ప్రకటించిన బాలకృష్ణ, సురేశ్​ బాబు

  • ఎన్నో చిత్రాలకు డిజైన్స్ తో ప్రచారం కల్పించారన్న బాలకృష్ణ
  • తమ సంస్థలో అత్యధిక సినిమాలకు పనిచేశారన్న సురేశ్ బాబు
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
Nandamuri Balakrishna and Suresh Babu Tributes On Eshwar Death

ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మృతి పట్ల సినీ హీరో నందమూరి బాలకృష్ణ, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

ఎన్నో చిత్రాలకు తన డిజైన్స్ తో ఈశ్వర్ ప్రచారం కల్పించారని, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని బాలకృష్ణ అన్నారు. తాను నటించిన కొన్ని సినిమాలకు ఈశ్వర్ పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

ఈశ్వర్ తో తమ సంస్థకు విడదీయలేని అనుబంధం ఉందని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు విచారం వ్యక్తం చేశారు. ఈశ్వర్ తమ సంస్థలో అత్యధిక సినిమాలకు పనిచేశారని గుర్తు చేశారు. నాన్నగారికి ఆయన డిజైన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. పబ్లిసిటీ డిజైనర్ గానే కాకుండా ఎన్నో సినిమాలకు క్యారెక్టర్ పోస్టర్స్ నూ ఆయన డిజైన్ చేశారనీ, ఈశ్వర్ మన మధ్య లేకపోవడం బాధ కలిగించే విషయమనీ అన్నారు.

More Telugu News