Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే మా సత్తా ఏమిటో చూపిస్తాం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ఘన విజయం సాధించినట్టు వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు
  • ప్రజల స్వేచ్ఛని హరించి గెలిచారు
  • వైసీపీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లడం లేదు
If you conduct Rajahmundry municipal elections we will show our power says Gorantla Butchaiah Chowdary

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్రజల స్వేచ్ఛని హరించి గెలిచారని అన్నారు. బహిష్కరించిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటం ఏమిటని అన్నారు. ఒంటరిగా పరీక్షలు రాసి నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పినట్టు వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపడుతోందని అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు, బెదిరింపులకు దిగడం అత్యంత హేయమని చెప్పారు.

ఇద్దరు పిల్లలుంటే అమ్మఒడి లేకుండా చేశారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. విదేశీ విద్యకు తూట్లు పొడిచారని విమర్శించారు. సొంత బాబాయిని హత్య చేసిన వాడిని కూడా ఇంత వరకు కనిపెట్టలేని జగన్... ఇక రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతాడని ప్రశ్నించారు. మహిళలకు ఎలా రక్షణ కల్పించగలరని అడిగారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లడం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల ఆశ చూపుతూ, ఓటు వేయకపోతే వాటిని తీసేస్తామని బెదిరిస్తూ గెలిచారని అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తే టీడీపీ సత్తా ఏమిటో చూసిస్తామని వ్యాఖ్యానించారు.

More Telugu News