Sonu Sood: ఐటీ దాడులు జరిగిన తర్వాత.. తొలిసారి భావోద్వేగంతో స్పందించిన సోను సూద్

  • నా శక్తి మేరకు ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నా
  • నా ఫౌండషన్ లో ఉన్న ప్రతి రూపాయి ఒక విలువైన జీవితాన్ని కాపాడేందుకు ఎదురుచూస్తోంది
  • ఈ నాలుగు రోజులు నా అతిథులతో బిజీగా ఉన్నా
Sonu Sood first response after IT raids

సోను సూద్... దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. సినీ నటుడిగా అందరికీ పరిచయమైన సోను... కోవిడ్ పంజా విసురుతున్న సమయంలో వేలాది పేదలకు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచారు. సాయం అడిగిన ఏ ఒక్కరికీ కాదనకుండా తన ఛారిటీ ద్వారా అండగా నిలిచారు. కోట్లాది రూపాయల తన సొంత డబ్బును సమాజసేవకు ఆయన ఖర్చు చేశారు.

మరోవైపు ముంబైలోని ఆయన నివాసంతో పాటు జైపూర్, నాగపూర్ లలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోను ఛారిటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తయిన తర్వాత రూ. 20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు.  

ఈ దాడులు జరిగిన తర్వాత సోను తొలిసారి స్పందించారు. "ప్రతిసారి నీ గురించి నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలను సమయం చెపుతుంది. దేశ ప్రజలకు నా శక్తి మేరకు సేవ చేయాలని మనస్పూర్తిగా నిర్ణయించుకున్నా. నా ఫౌండేషన్ లో ఉన్న ప్రతి రూపాయి కూడా ఒక విలువైన జీవితాన్ని కాపాడటం కోసం, అవసరమైన వారిని ఆదుకోవడం కోసం ఎదురు చూస్తోంది.

వివిధ ఎండార్స్ మెంట్ల ద్వారా వచ్చే డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని నా బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తుంటా. ఇప్పటికీ అది జరుగుతోంది. గత నాలుగు రోజులుగా నా అతిథుల (ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నా. అందువల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు మళ్లీ తిరిగివచ్చాను, నా ప్రయాణం కొనసాగుతుంది" అంటూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు.

More Telugu News