Jogi Ramesh: అయ్యన్న వ్యవహారంలో డీజీపీని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • అయ్యన్న వ్యాఖ్యలతో వైసీపీ నేతల ఆగ్రహం
  • చంద్రబాబు ఇంటి ముట్టడి
  • నిరసన తెలియజెప్పేందుకు వెళ్లానన్న జోగి రమేశ్
  • తనపైనే దాడి జరిగిందంటూ డీజీపీకి ఫిర్యాదు
Jogi Ramesh and Alla Ramakrishna Reddy met AP DGP

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. అయ్యన్నపాత్రుడుపైనా, చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయ్యన్న మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని జోగి రమేశ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అయ్యన్న వంటివారిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిరసన తెలియజేసేందుకు వెళితే తనపై దాడి చేశారు అని జోగి రమేశ్ ఆరోపించారు. అయ్యన్నను, చంద్రబాబును అరెస్ట్ చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అయ్యన్న మాటలు దారుణంగా ఉన్నాయని, జోగి రమేశ్ పై భౌతికదాడులకు పాల్పడడం హేయమని అభివర్ణించారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. డీజీపీని కలిసినవారిలో ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునరెడ్డి కూడా ఉన్నారు.

More Telugu News