Mahender Reddy: రాజు మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు: డీజీపీ మహేందర్ రెడ్డి

  • ఈ నెల 9న సైదాబాద్ లో శవమై తేలిన చిన్నారి
  • నిందితుడు రాజు పరారీ
  • తీవ్ర గాలింపు చేపట్టిన పోలీసులు
  • రైలు పట్టాలపై శవమై కనిపించిన రాజు
  • ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసులు
DGP Mahender Reddy reacts to allegations on Raju death

చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు ఆపై రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అంటుండగా, రాజు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రాజు మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని, ఇది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. రాజు మరణంపై అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు.

రాజు రైలు కింద పడ్డాడని చెప్పడానికి కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు లోకో పైలెట్లు ఇద్దరూ ప్రత్యక్షసాక్షులని, వారు కాకుండా ఇద్దరు రైల్వే గ్యాంగ్ మన్లు, ముగ్గురు రైతులు కూడా రాజు ట్రాక్ పై తిరుగుతుండడాన్ని చూశారని డీజీపీ వెల్లడించారు. రాజుది ఆత్మహత్యేనని, ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు కూడా సేకరించామని తెలిపారు. ఆరోపణలు చేసేవారు ఆధారాలతో ముందుకు రావాలని, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశారు.

More Telugu News