Ayyanna Patrudu: ఇలాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తుంటే అలా అనక ఇంకెలా అంటారు?: జగన్‌పై అయ్యన్నపాత్రుడు తిట్ల దండకం

  • పనికిమాలినోళ్ల పాలనకు ఏపీ అద్దం పడుతోంది  
  • మల్లెపూల వ్యాపారం కూడా ప్రారంభించి అంబటిని అధ్యక్షుడిని చేయండి
  • సన్నబియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల మంత్రి
  • హోం మంత్రిని చూస్తుంటే జాలేస్తోందన్న అయ్యన్న
TDP leader Ayyanna partrud slams YS Jagan

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో నిన్న మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. పనికిమాలినోళ్ల పాలనకు ఏపీ అద్దం పడుతోందన్నారు.

తాను అధికారంలోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందు చెప్పారని, పెంచడం అంటే పింఛను కాదని, పన్నులని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన సీఎం మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా? చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసేవాడిని అలా అనక ఇంకెలా అంటారంటూ ఓ పదాన్ని ప్రయోగించారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు.

పనిలో పనిగా మంత్రులపైనా అయ్యన్న విరుచుకుపడ్డారు. సన్నబియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖ మంత్రి అని, ఇరిగేషన్ మంత్రి బెట్టింగు రాయుడని పేర్కొన్న అయ్యన్న.. లేని దిశ చట్టంతో ఉరిశిక్ష, జీవితఖైదు వేస్తామంటున్న హోం మంత్రిని చూస్తుంటే జాలేస్తోందన్నారు. లేని చట్టం కోసం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని జగన్ ను ఉద్దేశించి మరోమారు తీవ్ర పద ప్రయోగం చేశారు.

హోంమంత్రికి సిగ్గు, లజ్జ ఉంటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ల బ్లాక్ టికెట్లు కూడా అమ్ముతామంటున్నారని, ఇంటింటికి మల్లెపూలు అమ్ముకునే వ్యాపారం కూడా ప్రారంభించి దానికి అంబటి రాంబాబును అధ్యక్షుడిని చేయాలని అయ్యన్న సూచించారు.

More Telugu News