Hyderabad: రాజు నా కుమార్తె జీవితాన్నీ నాశ‌నం చేశాడు.. ఇటీవ‌లే నా గొంతు ప‌ట్టుకున్నాడు: మౌనిక త‌ల్లి

  • రెండేళ్ల క్రితం మౌనిక‌తో రాజు పెళ్లి
  • కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మౌనిక‌
  • అత్తింటివారితోనూ రాజు గొడ‌వ‌లు
  • మ‌ద్యం మ‌త్తులో అత్త యాద‌మ్మ‌పై దాడి
  • చ‌చ్చి మంచి ప‌ని చేశాడ‌న్న యాద‌మ్మ‌
raju aunt on his suicide

హైద‌రాబాద్‌లోని సైదాబాద్ బాలిక హ‌త్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అత‌డికి రెండేళ్ల‌ క్రితమే సూర్యాపేట జిల్లా జ‌లాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో పెళ్లి జ‌రిగింది. ఆమె పేరునే రెండు చేతుల‌పై రాజు ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు.

ఒక చేతిపై మౌనిక పేరు ఇంగ్లిష్‌లో, మ‌రో చేతిపై తెలుగులో రాయించుకున్నాడు. రాజు భార్య ప్ర‌స‌వం కోసం ఏడాది క్రితం జ‌లాల్‌పురం వ‌చ్చి అక్క‌డే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు అత్తింటి వారిని కూడా వేధించేవాడ‌ని తెలిసింది. రెండు వారాల క్రితమే జ‌లాల్‌పురం వెళ్లి మ‌ద్యం మ‌త్తులో త‌న అత్త‌పై దాడి చేశాడు.

ఇప్పుడు రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక‌ జీవితాన్ని కూడా నాశనం చేశాడని వాపోయింది. త‌న అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అత‌డు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె వ్యాఖ్యానించింది.  

తన కుమార్తె మౌనిక‌కు రాజు వ‌ల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడద‌ని ఆమె అంది.  15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడ‌వ‌ప‌డి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాద‌మ్మ తెలిపింది. అప్పుడు త‌మ గ్రామం నుంచి వెళ్లిన రాజు మ‌ళ్లీ రాలేద‌ని చెప్పింది. కాగా, రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉండేవాడు.

More Telugu News