Rapist Raju: కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఎదురెళ్లి రేపిస్ట్ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: ప్రత్యక్ష సాక్షులు

  • ఆత్మహత్య సమయంలో అక్కడున్న ఇద్దరు రైల్వే కీమెన్లు
  • తమను చూసి చెట్లలోకి పారిపోయాడన్న కీమెన్లు
  • ఆ తర్వాత రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడి
Eyewitnesses response on rapist Raju suicide

హైదరాబాద్ సింగరేణి కాలనీలో చైత్ర అనే ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన రేపిస్ట్ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైల్వే ట్రాక్ పై అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరోవైపు రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులైన ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను అందించారు.

తామిద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని... ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి చెట్ల పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అప్పుడు అక్కడ తమతో పాటు మరికొందరు కూడా ఉన్నారని తెలిపారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచుకుంటూ వచ్చామని... ఆ సమయంలో హైదరాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

అనంతరం దగ్గరకు వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని... ఆ తర్వాత 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మరోవైపు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

More Telugu News