Teenmaar Mallanna: చిన్నారి హత్యకేసు నిందితుడ్ని పట్టుకోలేని పోలీసులు నాపై కక్ష సాధిస్తున్నారు: తీన్మార్ మల్లన్న

Teenmaar mallana fires on Police
  • ఫిబ్రవరిలో మల్లన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
  • నల్గొండ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • పోలీసులు తనపై కక్ష సాధిస్తున్నారన్న మల్లన్న
సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడ్ని పట్టుకోలేని పోలీసులు తనపై కక్ష సాధిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ఆరోపించారు. మల్లన్న దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అడ్డగూడూరుకు చెందిన మహిళ అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు నిన్న మల్లన్నను ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరు పరిచేందుకు నల్గొండ తీసుకొచ్చారు. మల్లన్నకు న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు.

ఈ సందర్భంగా మల్లన్న అక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తన భార్య, అత్తమామలు కూడా దళితులేనని, తాను తన కుటుంబ సభ్యులను ఎలా కించపరుస్తానని ప్రశ్నించారు. ఇదంతా తనపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదన్నారు. తనపై ఇప్పటికే 35 కేసులు బనాయించారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి తమ వంతు సహకరిస్తున్నారని మల్లన్న ఆరోపించారు.
Teenmaar Mallanna
Police
Telangana

More Telugu News