Veerappa Moily: పార్టీకి సోనియా భారీ శస్త్రచికిత్స చేస్తున్నారు.. ఇక జి-23తో పనిలేదు: వీరప్ప మొయిలీ

  • పార్టీలో మేం కోరుకున్న సంస్కరణలు మొదలయ్యాయి
  • పార్టీ నాశనాన్ని కోరుకోలేదు
  • జి-23కి ఇప్పుడిక అర్థం లేదు
Some Leaders Misused G 23  M Veerappa Moily Speaks On Congress Reform

కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన మొదలైందని, ఇక జి-23తో పనిలేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. పార్టీలో సంస్కరణలు అంతర్గతంగా రావాలన్న ఉద్దేశంతో తమలో కొందరు గతంలో రాసిన లేఖలపై సంతకాలు చేశామని గుర్తు చేశారు. పార్టీలో పునర్నిర్మాణం జరగాలనే తాము కోరుకున్నాం తప్పితే, పార్టీ నాశనాన్ని తాము కోరుకోవడం లేదన్నారు.

అయితే, పార్టీలో అంతర్గత ప్రక్షాళన కోసం తాము లేవనెత్తిన అంశాన్ని కొంతమంది దుర్వినియోగం చేశారని విమర్శించారు. 23 మంది నేతలు (జి 23) కోరుకున్న విధంగానే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీలో భారీ సంస్కరణలు మొదలుపెట్టారని మొయిలీ అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రక్షాళన మొదలు కావడంతో ఇక జి-23తో పనిలేదన్నారు. అసలిప్పుడు దీనికి అర్థం కూడా లేదని తేల్చి చెప్పారు.

ఇంకా ఎవరైనా దాని గురించి పట్టుబడుతున్నారంటే దాని వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్టేనని కుండబద్దలు కొట్టారు. తాము కోరుకున్న భారీ శస్త్రచికిత్స పార్టీలో మొదలైందని, సోనియా గాంధీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనను ఆయన సమర్థించారు.

More Telugu News