Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. నేడు బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యే రాజ్‌కుమార్

  • టికెట్ ఇవ్వకపోవడంతో 2017లో బీజేపీని వీడిన రాజ్‌కుమార్
  • వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తిరిగి కాషాయ గూటికి
  • ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
  • 2017 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సీఎంల మార్పు
Uttarakhand Congress MLA Rajkumar likely to join BJP today in Delhi

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ నేడు ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. రాజ్‌కుమార్ పురోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన 2007 నుంచి 2012 వరకు బీజేపీతోనే ఉన్నారు. 2012, 2017 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరుతుండడం గమనార్హం.

ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2017 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. వచ్చే ఏడాది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్న బీజేపీ ఈసారి చాలా వరకు నియోజకవవర్గాల్లో కొత్త వారిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.

More Telugu News