Hyderabad: ప్రేమ పెళ్లికి నిరాకరించిన తల్లి.. ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని దారుణంగా హతమార్చిన కుమార్తె

  • కుమార్తె వ్యవహారం తెలిసి మందలించిన తల్లి
  • బొటిక్ పెట్టుకునేందుకు రూ. 2 లక్షలు అడిగితే నిరాకరణ
  • కక్షతో తల్లి హత్యకు ప్లాన్
  • ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి కర్కశంగా చంపిన కుమార్తె
Daughter killed her mother with the help of boy friend in Hyderabad

ప్రేమ పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని కర్కశంగా మట్టుబెట్టిందో యువతి. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన మేరీ క్రిస్టీనా (68) మూడు దశాబ్దాల క్రితం కుమార్తెలు మేరీ సొలాంగ్, రెబెకాలతో కలిసి హైదరాబాద్ వచ్చి గండిపేట మండలం దర్గాఖలీజ్‌ఖాన్‌ కాలనీలో స్థిరపడ్డారు. ప్రశాంత్ అనే యువకుడిని పెళ్లాడిన మేరీ సొలాంగ్ సన్‌సిటీలో ఉంటుండగా, రెబెకా పుదుచ్చేరిలో ఉంటోంది. దీంతో ఒంటరిగా ఉంటున్న మేరీ అనాథలైన రోమా (24), ప్రియాంకను ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఈ క్రమంలో రోమాకు పెళ్లి చేయాలని భావించిన క్రిస్టీనా పెళ్లి సంబంధాలు చూస్తోంది.

మరోవైపు, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్ శ్రీరాములు (25)తో రోమా ప్రేమలో పడింది. పెంపుడు తల్లికి తెలియకుండా కొండాపూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ శ్రీరాములుతో సహజీవనం చేస్తోంది. విషయం తెలిసిన క్రిస్టీనా ఆమెను మందలించింది. కాగా, తాను బొటిక్ పెట్టుకోవాలనుకుంటున్నానని, రూ. 2 లక్షలు కావాలని తల్లిని రోమా కోరింది. ఇందుకామె నిరాకరించింది. దీంతో ఆమె చాలా క్రూరంగా ఆలోచించింది. చంపేసి తల్లి ఖాతాలో ఉన్న రెండు లక్షల రూపాయలు తీసుకోవాలని ప్రియుడు విక్రమ్, నెల్లూరుకు చెందిన అతడి స్నేహితుడు రాహుల్ గౌతమ్ (24)తో కలిసి ప్లాన్ చేసింది.

ఈ నెల 8న సాయంత్రం క్రిస్టీనా తన కారులో టోలీచౌకి స్కూలుకు వెళ్లి రోమాను అక్కడ వదిలి తిరిగి ఇంటికి చేరుకుంది. ప్లాన్ ప్రకారం అప్పటికే విక్రమ్, రాహుల్ ఆమె ఇంటివద్ద కాపు కాశారు. ఇంటికి చేరుకున్న క్రిస్టీనా కారును పార్కింగ్ చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ ఆమెపై దాడిచేసి మెడకు ఉరి బిగించి చంపేశారు. అనంతరం మేరీ మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి హిమాయత్‌సాగర్ సమీపంలోకి చేరుకుని అక్కడ పొదల్లో పడేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు.

ఆ తర్వాతి రోజు మేరీ బ్యాంకు ఖాతా నుంచి రూ. 2 లక్షలను రోమా తన ఖాతాలోకి బదిలీ చేసుకుంది. మరోవైపు, తల్లి మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో ఆమె కుమార్తె సొలాంగ్, భర్త ప్రశాంత్ కలిసి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోమా, విక్రమ్, రాహుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

More Telugu News