Sai Dharam Tej: బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే సాయి ధరమ్ తేజ్ కు ఫిట్స్ వచ్చాయి: మెడికవర్ వైద్యులు

  • సరైన సమయంలో తేజ్ ను హాస్పిటల్ కు తీసుకొచ్చారు
  • ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు
Medi Cover hospital report on Sai Dharam Tej accident

నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ను తొలుత మెడికవర్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. మరోవైపు సాయితేజ్ కు సంబంధించి మెడికవర్ వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. సరైన సమయంలో సాయితేజ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారని... అందువల్లే ఆయనకు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. సరైన సమయంలో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)లో 108 సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారని కితాబునిచ్చారు.

బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే తేజ్ కు ఫిట్స్ వచ్చాయని... 108 సిబ్బంది తమ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే తేజ్ అపస్మారక స్థితిలో ఉన్నారని మెడికవర్ వైద్యులు చెప్పారు. తేజ్ కు రెండో సారి ఫిట్స్ రాకుండా తాము చికిత్స చేశామని తెలిపారు. ఆ తర్వాత బ్రెయిన్, షోల్డర్, స్పైనల్ కార్డ్, అబ్ డామిన్, చెస్ట్ స్కానింగ్ లు చేశామని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు పెద్ద గాయాలు కాలేదని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వల్ల... ఆయనకు కృత్రిమ శ్వాస పెట్టామని చెప్పారు.

ప్రస్తుతం తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.

More Telugu News