nagababu: సినీన‌టుడు మోహ‌న్ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డ నాగ‌బాబు

  • గ‌తంలో 'మా' బిల్డింగ్ ను ఎక్కువ ధ‌ర‌కు కొన్నార‌న్న మోహ‌న్ బాబు
  • తర్వాత త‌క్కువ ధ‌ర‌కు అమ్మార‌ని విమ‌ర్శ‌
  • ఆ విష‌యం న‌రేశ్‌నే అడ‌గాల‌న్న నాగ‌బాబు
  • త‌న‌పై మ‌రోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే తీవ్రంగా స్పందిస్తాన‌ని వ్యాఖ్య
nagababu slams mohanbabu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో ప‌లువురు సినీన‌టులు చేసుకుంటోన్న విమ‌ర్శ‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల సినీనటుడు మోహన్ బాబు మా బిల్డింగ్ గురించి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. గతంలో ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు ఆ భ‌వ‌నాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకు అమ్మేశారని ఆయ‌న విమర్శించారు.  

మోహన్‌బాబు వ్యాఖ్యలపై నాగబాబు తాజాగా స్పందిస్తూ మండిప‌డ్డారు. భ‌వ‌నాన్ని కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పారు. 2006-2008 మ‌ధ్య తాను అధ్య‌క్షుడిగా ఉన్నాన‌ని తెలిపారు. అప్ప‌ట్లో సినీ ప్ర‌ముఖుల సూచనలు, అప్ప‌టి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశామ‌ని వివ‌రించారు.

అలాగే, ఇంటీరియర్ డిజైన్‌ కోసం మరో రూ.3 లక్షలు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. తాను 2008లో అధ్యక్ష ప‌ద‌వి నుంచి దిగిపోయిన అనంత‌రం మా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని చెప్పారు. అసోసియేష‌న్ అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానని అన్నారు. ఆ భ‌వ‌న‌ అమ్మకం వ్యవహారమంతా నరేశ్-శివాజీ రాజాలకే తెలుసని తెలిపారు.

అప్ప‌ట్లో శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో నరేశ్‌ కార్యదర్శిగా ఉన్నార‌ని, ఆ స‌మ‌యంలో ఆ భ‌వ‌నాన్ని రూ.30 లక్షలకే అమ్మేశారని అన్నారు. ఈ విష‌యం గురించి నరేశ్‌నే అడగాల‌ని మోహ‌న్ బాబుకు సూచించారు. తాను కూడా అదే విషయంపై నరేశ్‌ని ప్రశ్నిస్తానని చెప్పారు. అంతేగానీ, భ‌వ‌నం అమ్మకం గురించి త‌న‌పై వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తానని నాగ‌బాబు హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News